శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.
''శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి'' ప్రతి ఏటా మాఘ మాసంలో నిర్వహించడం ఆనవాయితి.
ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది.
ఆశ్లేష నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినాన్ని ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగిన దోషాల నివారణకు ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తారని ప్రాశస్త్యం.
ఈ పర్వదినంనాడు ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రితో బయల్దేరతారు.
శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకుని అక్కడ వెలసివున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు.